NEWS

జిల్లా వ్యాప్తంగా లోటు వర్షపాతం.. వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతాంగం..

స్ప్రిక్లర్స్ తో నిరందిస్తున్న రైతులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాన జాడ లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. మృగశిర కార్తె ప్రారంభంలో కురిసిన వర్షానికి రైతులు తమ పంట పొలాల్లో విత్తనాలు విత్తుకున్నారు. ఎక్కువ మంది రైతులు పత్తి పంటనే విత్తుకున్నారు. అయితే ఈ యేడాది వానాకాలం మొదలైనప్పటి నుండి ఇప్పాటి వరకు వాన జాడ లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా లోటు వర్ష పాతం నమోదైంది. ఉమ్మడి జిల్లా అత్యధిక లోటు వర్షపాతం మంచిర్యాల జిల్లాలో నమోదైంది. కాగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మాత్రం కొంత మెరుగుగా ఉంది. మంచిర్యాల జిల్లాలో 67 శాతం లోటు వర్షపాతం నమోదైతే, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 22 శాతమే లోటుగా నమోదింది. అటు ఆదిలాబాద్ జిల్లాలో 49 శాతం లోటు ఉంటే నిర్మల్ జిల్లాలో 41 శాతం లోటు వర్షపాతం నమోదింది. అయితే తొలకరి వర్షానికి విత్తనాలు వేసుకున్న రైతులు ఆ తర్వాత ఒక్క వర్షం కురియకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. నాటిన విత్తనాలను కాపాడుకునేందుకు కొందరు రైతులు స్ప్రింక్లర్లతో నీటిని అందిస్తున్నారు. ఇపుడు వాన పడకపోతే విత్తనాలు మాడిపోయి నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ యేడాది వానాకాలం మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చిరుజల్లులే కురిశాయి తప్ప చెప్పుకోదగ్గ స్థాయిలో భారీ వర్షాలు మాత్రం పడలేదు. ఈసారి నైరుతి రుతుపవనాలు ముందస్తుగానే విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో జిల్లాలోని రైతులు దుక్కులు సిద్దం చేసుకొని విత్తనాలు కూడా వేసుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 16 లక్షల 50 వేల ఎకరాలు కాగా, ఇందులో 12 లక్షల 20 వేల ఎకరాల్లో వర్షాధారంపైనే పత్తి పంటను సాగు చేస్తున్నారు. అయితే జిల్లాలో జూన్ నెల మొదటి వారం నుండి ఇప్పటి వరకు అడపాదడపా తేలికపాటి జల్లులు కురిశాయి. తప్ప భారీ వర్షం నమోదుకాలేదు. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 46.5 మిల్లి మీటర్ల వర్షపాతం కురియాల్సి ఉండగా 33.4 మిల్లిమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఈ ఖరీఫ్ వేసే ముఖ్యమైన పంటలు పత్తి, సోయా చిక్కుడు పంటలను కనీసం 60 నుండి 80 మిల్లిమీటర్ల వర్షం పడిన తర్వాతనే విత్తుకోవాలని, లేదంటే మొలక శాతం తక్కువగా వచ్చే అవకాశం ఉందని ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డా. ఎం. రఘువీర్ తెలిపారు. మరోవైపు వాన జాడ లేక జిల్లాలోని ప్రధాన జలాశయాలు వెలవెలబోతున్నాయి. కడెం, ఎల్లంపల్లి, మత్తడివాగు, సాథ్నాల ప్రాజెక్టుల్లో నీరు అడుగంటుతోంది. ఇది చూసి ఆయకట్టు రైతులు మరింత ఆవేదన చెందుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. None

About Us

Get our latest news in multiple languages with just one click. We are using highly optimized algorithms to bring you hoax-free news from various sources in India.